High tension in Bandi Sanjay Nalgonda tour: నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పర్యటన ఉద్రిక్తతంగా మారింది. అర్జాల బావిలో ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సంజయ్‌ను స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా ఒప్పించిన తర్వాతే జిల్లాలో అడుగుపెట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) డిమాండ్ చేశారు. ఆ మేరకు రైతులు సంజయ్‌ను నిలదీయాలన్నారు. సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నల్ల జెండాలు ప్రదర్శించారు. బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా పోలీసులు ఇరువురినీ చెదరగొట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉద్రిక్తత కొనసాగుతుండగానే బండి సంజయ్ (Bandi Sanjay) అర్జాల బావిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పత్తి కేంద్రమే కొంటున్నది, మక్కలు కేంద్రమే కొంటున్నదని చెప్పారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయిందని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకూ 7లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనడమేంటని ప్రశ్నించారు. రైతులు పండించిన ప్రతీ గింజా కొంటామని కేసీఆర్ గతంలో చెప్పారని... తీరా ఇప్పుడు సమస్యను పరిష్కరించకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.


 



కేసీఆర్ (KCR) ఇకనైనా గజనీ వేషాలు మానుకోవాలని హెచ్చరించారు. వానా కాలంలో రైతులు పండించిన పంట మొత్తాన్ని ప్రభుత్వం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ కార్యకర్తలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రైతుల కోసం తాను రాళ్ల దాడికైనా సిద్ధమేనన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నా రాష్ట్రం పట్టించుకోవడం లేదని అన్నారు. కేసీఆర్ బాధ్యత మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


Also Read :Candice Warner Twitter: ‘వార్నర్ ఫామ్ లో లేడా?’.. ఐపీఎల్ ఫ్రాంఛైజీపై వార్నర్ భార్య ఫైర్?


ఆర్జాల బావి పర్యటన తర్వాత బండి సంజయ్, మిర్యాలగూడ నేరేడుచర్ల గడిపల్లి ప్రాంతాలలో పర్యటించనున్నారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ రాత్రికి సూర్యాపేటలో బస చేయనున్నారు. మంగళవారం (నవంబర్ 15) తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పుల, జనగామ మండలాలలో సంజయ్ పర్యటించనున్నారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై కొద్దిరోజులుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రమే వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని (Paddy Procurement) టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా... ప్రతీ గింజ కొంటామని గతంలో చెప్పిన కేసీఆర్... ఆ మేరకు వడ్లన్నీ కొని తీరాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook