Dalita Bandhu Scheme money will be credited from this date: యాదాద్రి భువనగిరి: వాసాలమర్రి పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంపై కీలక ప్రకటన చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం (Alair) పరిధిలో తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో రేపటి నుంచే దళిత బంధు పథకం అమలవుతుందని కేసీఆర్ స్పష్టంచేశారు. వాసాలమర్రిలోని అర్హులైన 76 దళిత కుటుంబాలకు రేపే ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున అందుతాయని ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దళిత బంధు పథకం డబ్బులు వచ్చినప్పటికీ ఇతర సంక్షేమ పథకాలు యథావిథిగానే కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. దళిత బంధు పథకం ద్వారా వచ్చిన డబ్బుల్లోంచి 10 రూపాయలు కాదు 10 పైసలు కూడా వృథాగా ఖర్చు చేయొద్దని దళిత బంధు పథకం లబ్ధిదారులకు సూచించారు. 10 లక్షల నగదు లోంచి 10 రూపాయలు తగ్గించి ఇస్తాం. అలా ప్రతీ ఒక్కరిలోంచి తగ్గించిన పది రూపాయలను దళిత రక్షణ నిధిగా ఏర్పాటు చేస్తాం. ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే దళిత బంధు రక్షణ నిధి (Dalita Bandhu Rakshana nidhi) డబ్బులను వినియోగించుకోవచ్చు అని సీఎం కేసీఆర్ వివరించారు. 


ఈ సందర్భంగా వాసాలమర్రి గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ (CM KCR in Vasalamarri).. దళిత బంధు పథకం నిధులతో పాటు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా కట్టించి ఇస్తాం'' అని భరోసా ఇచ్చారు. మరో వారం రోజుల తర్వాత వాసాలమర్రి గ్రామానికి వస్తానని.. దళితులతో కలిసి తాను భోజనం చేస్తానని వ్యాఖ్యానించారు.


ఇదిలావుంటే, ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గం (Huzurabad bypolls) నుంచే పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకం అమలు చేస్తామని గతంలో ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడిలా ఆలేరు నియోజకవర్గంలో తన దత్తత గ్రామమైన వాసాలమర్రి నుంచి దళిత బంధును ప్రారంభిస్తుండటం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది.