Former CM KCR Helath Update: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాలికి గాయమైంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆయన కాలికి పంచ తగిలి కాలు కిందపడినట్లు తెలుస్తోంది. హుటాహుటిన చికిత్స కోసం ఆయన యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. మరికాసేపట్లో మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. కాలికి స్వల్పంగా ఫ్రాక్చర్ అయిందని చెబుతున్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యులతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడారు. కేసీఆర్‌కు శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు చెబుతున్నారు. రెండు రోజుల్లో కేసీఆర్‌ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"కింద పడటంతో కేసీఆర్ గారికి తుంటి ఎముక విరిగింది. ఈ సాయంత్రం వైద్యులు కేసీఆర్ గారికి శస్త్ర చికిత్స  చేస్తారు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున కార్యకర్తలు ఎవరూ ఆసుపత్రి వద్దకు రావద్దు. కేసీఆర్ గారి ఆరోగ్యం కోసం అందరూ మీ ఇంటి వద్దనే ప్రార్ధన చేయండి. కేసీఆర్ గారు కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు.." అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.


 



"మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.." అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.


 




 



కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని..  ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలని వెల్లడించారు. బాత్‌రూమ్‌లో జారిపడటంతో ఆయన ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందన్నారు. కేసీఆర్‌ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అన్నారు.