Nallala Odelu Joins Congress: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ గూటికి చేరారు. మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్, తన సతీమణి భాగ్యలక్ష్మితో కలిసి ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో ఆయన చేరిక జరిగింది. చెన్నూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరుపున మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓదెలు పార్టీకి అనూహ్యంగా షాకిచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లాల ఓదెలుకు టీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు. తనకు బదులు బాల్క సుమన్‌కు టికెట్ ఇవ్వడంతో అధిష్ఠానం నిర్ణయాన్ని ఓదెలు తీవ్రంగా ప్రతిఘటించారు. అప్పట్లో స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లి నిరసన తెలిపారు. ఓదెలుకు టికెట్ దక్కలేదని నిరాశ చెంది నియోజకవర్గంలోని ఇందారం పట్టణంలో ఆయన అనుచరుడు ఒకరు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. ఈ క్రమంలో బాల్క సుమన్, ఓదెలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు.


టీఆర్ఎస్ అధిష్ఠానం వద్ద సుమన్ తన గురించి తప్పుగా చెప్పి తనకు రావాల్సిన టికెట్ లాగేసుకున్నాడని ఓదెలు ఆ సందర్భంలో ఆరోపించారు. స్థానికుడైన తనను కాదని, స్థానికేతరుడైన సుమన్‌కు టికెట్ ఎలా ఇస్తారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్ నేరుగా ఓదెలుతో మాట్లాడి నచ్చజెప్పడంతో ఆయన శాంతించక తప్పలేదు. భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని అధిష్ఠానం ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలో ఇన్నాళ్లు సుమన్‌తో కలిసి పనిచేశారు. సతీమణి భాగ్యలక్ష్మికి మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ పదవి ఇచ్చినప్పటికీ ఆయన సంతృప్తి చెందలేదు. తనకు ఎటువంటి పదవి కట్టబెట్టకపోవడంతో ఆయనలో అసంతృప్తి గూడుకట్టుకుంది.


నిజానికి నల్లాల ఓదెలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు ఇప్పుడాయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చెన్నూర్ అసెంబ్లీ టికెట్ హామీ మేరకే ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాలనే ఉద్దేశంతోనే హస్తం గూటికి చేరినట్లు తెలుస్తోంది. ఒక సాధారణ ప్రైవేట్ స్కూల్ హెడ్ మాస్టర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి... తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీతో ఓదెలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నిరుపేదనైన తనకు ఎన్నికలకు పోటీ చేసేందుకు డబ్బులిచ్చి మరీ కేసీఆర్ ప్రోత్సహించారని చాలా సందర్భాల్లో చెప్పారు. అధిష్ఠానానికి ఎప్పుడూ విధేయుడిగా వ్యవహరించారు. అయితే సుమన్ రూపంలో తన టికెట్‌కే ఎసరు పెట్టడంతో ఓదెలు చూపు కాంగ్రెస్ వైపు మళ్లింది. ప్రస్తుతం నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించిన సుమన్‌ను ఓదెలు ఎలా ఢీకొడుతారో వేచి చూడాలి. 


Also Read: Jeevitha Rajasekhar Apology: ఆర్యవైశ్యులకు జీవిత రాజశేఖర్ క్షమాపణ... వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ...   


Also Read: Kl Rahul Record: లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఖాతాలో సరికొత్త రికార్డు..ఏమిటది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.