Huzurabad exit poll results declared: హైదరాబాద్: హుజూరాబాద్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. హుజూరాబాద్‌లో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఉప ఎన్నిక పోరులో ఓటింగ్ ప్రక్రియ ఇవాళ శనివారం రాత్రి 7 గంటలకు ముగిసింది. ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో ఇక ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిపైనే సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే, అంతకంటే ముందుగా కొద్దిసేపటి క్రితమే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హుజూరాబాద్ పోలింగ్‌పై సంస్థలు చేపట్టిన సర్వేలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపి అభ్యర్థి ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. హుజూరాబాద్ నియోజవర్గం (Huzurabad constituency) పరిధిలో మొత్తం 306 పోలింగ్‌ స్టేషన్లలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ ఉప ఎన్నికపై 'పీపుల్స్ పల్స్' అనే సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఓటర్లు బీజేపీ వైపే ఉన్నట్టు కనిపించింది. 


బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ (Gellu Srinivas) మధ్య ఓట్ల వ్యత్యాసం 7-9 శాతంగా ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల పోరు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి మధ్యే కనిపించిందని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతు కానుందని పీపుల్స్ పల్స్ అభిప్రాయపడింది. 


బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్‌ 20 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉండటం, టీఆర్ఎస్ పార్టీ చేతిలో ఇబ్బందులకు గురయ్యారనే సానుభూతి, తాను రాజీనామా చేయడం వల్లే దళిత బంధు పథకంతో పాటు హుజూరాబాద్‌కి ఎన్నో వరాలు వచ్చిపడ్డాయని ఈటల రాజేందర్ చేసుకున్న ప్రచారం ఆయనకు కలిసొచ్చిందని పీపుల్స్ పల్స్ సర్వే (Peoples pulse survey) అభిప్రాయపడింది. 


హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు (Huzurabad exit polls results) వెల్లడించిన పొలిటికల్ ల్యాబొరేటరీ అనే సంస్థ.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 24వేల ఓట్ల తేడాతో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. బీజేపీకి 51% ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 42% ఓట్లు లభించే అవకాశం ఉందని పొలిటికల్ ల్యాబోరేటరీ పేర్కొంది. 


ఈటల రాజేందర్ సొంత మండలం కమలాపూర్‌‌తో పాటు ఇల్లంతకుంటలో ఈటలకు మంచి బలం ఉంది. కానీ ఇక్కడే టీఆర్ఎస్‌కు ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందని పొలిటికల్ ల్యాబరేటరీ సందేహం వ్యక్తంచేసింది. హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట మండలాల్లో ఈటల రాజేందర్‌కి (Etala Rajender) భారీ మెజార్టీ లభిస్తుందని ఆ సంస్థ అంచనా వేస్తోంది.