హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికను ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వివిధ సామాజిక కోణాల్లో దాదాపు 50 మంది ఇన్‌చార్జీలను నియమించడమే కాకుండా మంత్రులను కూడా ప్రచారంలో పాల్గొనాల్సిందిగా ఆదేశించింది. ఇక్కడ విజయం సాధించేందుకు స్థానికంగా సీపీఐకి ఉన్న ఓటు బ్యాంకును కూడా వదలకూడదని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీపీఐ మద్దతు కోరేందుకు టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ ఎంపీలు, అగ్రనేతలను సీపీఐ కార్యాలయానికి పంపించినట్టు సమాచారం. 


ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు టీఆర్‌ఎస్ అగ్రనేతలు కే కేశవరావు, వినోద్ కుమార్, నామా నాగేశ్వర్రావు సీపీఐ కార్యాలయమైన మగ్దూం భవన్‌కు వెళ్లారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో తమకు మద్దతు పలకాల్సిందిగా సీపీఐ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.