సంగారెడ్డి: గోదావరి జలాలను సంగారెడ్డి జిల్లాకు తరలించాలనే డిమాండ్‌తో జలదీక్ష చేపట్టడానికి వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి‌ని పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డికి గోదావరి జలాలను తరలించాలని గత కొద్ది రోజులుగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గోదావరి జలాలను తమ జిల్లాలకు తరలించే వరకూ నిరాహార దీక్షకు దిగుతానని జగ్గా రెడ్డి హెచ్చరించారు. అందులో భాగంగానే నేడు జలదీక్షకు వెళ్తున్న జగ్గారెడ్డిని పోలీసులు మార్గం మధ్యలోనే అరెస్ట్ చేసి కొండాపూర్‌ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. జగ్గా రెడ్డి అరెస్ట్ సందర్భంగా ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కొంత ప్రతిఘటన ఎదురైనట్టు తెలుస్తోంది.