Kanti Velugu: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి మరోసారి కంటి వెలుగు కార్యక్రమాన్ని విస్ర్కత స్థాయిలో చేపట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గురువారం పలు ప్రభుత్వ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షలు చేపట్టిన ముఖ్యమంత్రి.. ఆరోగ్య శాఖ సమీక్షలో భాగంగా కంటి వెలుగు కార్యక్రమ అమలు తీరు, రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నమూనాల పరిశీలన, ప్రజారోగ్యం వైద్యం, తదితర అంశాలపైనా సమావేశం నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... '' గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నదని గుర్తుచేశారు. ముఖ్యంగా తమ కంటి చూపు కోల్పోయిన నిరుపేదలైన వృద్ధులకు కంటి వెలుగు పథకం ద్వారా కంటి చూపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేసి ఆపరేషన్ అవసరం లేకుండా కంటి అద్దాలు అవసరమైన వారికి అందించి తిరిగి కంటి చూపు పొందేలా ఉపయోగపడింది. కంటిచూపు పొందిన వారి ఆనందానికి అవధులు లేవు. పేదల కళ్లల్లో వెలుగులు నింపి వారి ఆనందాన్ని పంచుకోవడం గొప్ప విషయం. గతంలో అందించిన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకం ద్వారా మరోసారి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు అందిస్తాం" అని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.


ఇందుకు సంబంధించిన సిబ్బందిని కళ్లద్దాల పరికరాలు సమకూర్చుకోవడం, తదితర అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సిఎం కేసీఆర్ సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్ రెడ్డి, బాల్క సుమన్, కంచర్ల భూపాల్ రెడ్డి, జి.విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనా చారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఫారెస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, హెల్త్ సెక్రటరీ రిజ్వి, డీఎంఈ రమేశ్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు, కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ శ్వేతా మహంతి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.