తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి అధినేత కోదండరామ్ కొత్త పార్టీ పెట్టడానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో ఈ విషయంపై ప్రజలతో తన ఆలోచనలను పంచుకోవడానికి ఆయన ఏప్రిల్ 2వ తేదిన సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు.. అదే రోజు ఆయన పార్టీని, పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"తెలంగాణ జన సమితి"గా పార్టీ పేరును ఇప్పటికే పలువురు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఏప్రిల్ 29వ తేదిన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నేతలు, వాలంటీర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే భాగ్యనగరంలో ఏ ప్రాంతంలో ఈ సభను నిర్వహిస్తారన్న విషయంపై ఎలాంటి సమాచారము లేదు. ఈ విషయంపై పోలీస్ అనుమతి కోరుతూ ఇప్పటికే ఐకాస నేతలు, సంబంధిత అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది. 


కోదండరామ్‌గా సుపరిచితులైన  ముద్దసాని కోదండ రామిరెడ్డి కరీంనగర్ జిల్లాలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు అయినప్పుడు కోదండరామ్ దానికి అధ్యక్షులుగా పనిచేశారు. కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌ వంటి పోరాటాల్లో కూడా పాల్గొన్నారు.


అయితే తెరాస అధికారంలోకి వచ్చాక.. ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని .. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని కోదండరామ్ పలుమార్లు
ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితినే రాజకీయ పార్టీగా మార్చాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఆ ఆలోచనను మార్చుకొని.. ఐకాస అనేది ఉంటుందని.. కానీ రాజకీయ పార్టీని వేరేగా ప్రారంభిస్తామని కోదండరామ్ గతంలో తెలిపారు