మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని జాన్సి లింగాపూర్ గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆదివారం అడవిలో ప్రేమజంట ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం అందుకున్న రామాయంపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు జాన్సి లింగాపూర్ గ్రామానికి చెందిన బాలు, అదే జిల్లాలోని నిజాంపేట్ మండలం రాయలపూర్ గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. స్థానికులు చెబుతున్న వివరాలు, ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదని, ఆ మనస్తాపంతోనే ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది.


ప్రేమ జంట ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. ప్రేమ జంట ఆత్మహత్యకు వెనుకున్న కారణాన్ని తెలుసుకునే పనిలో నిమగ్నమైన పోలీసులు ఇరు కుటుంబాల పెద్దలను ప్రశ్నించి, వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తున్నట్టు సమాచారం.