Karimnagar Assembly Constituency: ఎంపీగా గెలిపిస్తే బండి సంజయ్ కరీంనగర్‌కు చేసిందేమీ లేదంటూ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. కరీంనగర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్రానివేనని స్పష్టం చేశారు. ‘‘స్మార్ట్ సిటీ నిధులు తెచ్చిన. ఆర్వోబీ నిధులు తెచ్చిన. రోడ్లకు నిధులు తెచ్చిన. అంతేందుకు డ్రైనేజీ, టాయిలెట్లుసహా కరీంనగర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రమే నిధులిస్తోంది’’ అని చెప్పారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌కు సవాల్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘‘కమలాకర్.. డేట్, టైం ఫిక్స్ చేయ్. అకౌంట్స్ తీసుకుని రా.. నేను ఎంపీగా గెలిచాక కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చానో లెక్కలతో సహా వస్తా. చర్చిద్దాం. సిద్ధమా..?’’ అంటూ సవాల్ విసిరారు. తాను కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తే.. అన్నీ తానే చేసినట్లుగా గంగుల కమలాకర్ చెప్పుకోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ గురువారం సప్తగిరి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా 35వ డివిజన్‌లో గాజా రమేశ్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది నాయకులు  బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 


"నేను ఎంపీగా ఎన్నికైన తరువాత 8 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చా. వీధి దీపాలు, డ్రైనేజీసహా కరీంనగర్‌లో జరుగుతున్న అభివృద్ది నిధులన్నీ కేంద్రానివే. తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిధులు కేంద్రానివే. స్మార్ట్ సిటీ నిధులన్నీ కేంద్రానివే. సర్కస్ గ్రౌండ్, ఆర్ట్స్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ అభివృద్ధికి నేను నిధులు తెచ్చా. రోడ్లు, డ్రైనేజీ పనులకు నిధులు కేంద్రమే ఇస్తోంది. జాతీయ రహదారుల విస్తరణ నిధులు కేంద్రానివే. చివరికి వైకుంఠ ధామాల నిధులు కేంద్రానివే. నిధులు నేను తీసుకొస్తే కొబ్బరికాయ మాత్రం బీఆర్ఎస్ నేతలు కొట్టి తామే నిధులు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు.


అంతేగాకుండా ఎంపీగా నన్ను గెలిపిస్తే ఎన్నడూ ఖాళీగా లేను. మీ కోసం పోరాటం చేసిన. నాపై ఏకంగా 74 కేసులు పెట్టారు. నా ఆస్తికోసమో, కుటుంబం కోసమే కొట్లాడలే. పేదల కోసం కొట్లాడిన. నిరుద్యోగ యువత కోసం కొట్లాడితే కేసులు పెట్టిండు. రైతుల పక్షాన ఉద్యమిస్తే కేసులు పెట్టిండు. ఒక్కసారి ఆలోచించండి. మీకోసం ఎవరైనా కొట్లాడుతున్నారా?


బీఆర్ఎస్‌కు ఓట్లేసి గెలిపిస్తే.. అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ వందల కోట్లు దండుకుంటున్నారు. పేదల భూములను లాక్కుంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్‌లో రౌడీయిజం, గూండాగిరి ఎక్కువైంది. పేదలపై దాడులు చేస్తున్నారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రౌడీయిజాన్ని అంతం చేస్తా. పేదల జోలికి వచ్చే వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఉరికించి కొడతాం.


బండి సంజయ్‌ది మచ్చలేని జీవితం. నేను ఏనాడైనా కబ్జాలు చేశానా..? ఎన్నడైనా కమీషన్లు తీసుకున్ననా..? ఎన్నడైనా తప్పుడు పనులు చేశానా..? మీ తీర్పు కోసం 50 లక్షల మంది నిరుద్యోగులు చూస్తున్నరు. 40 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నరు. లక్షలాది మంది ఉద్యోగులు చూస్తున్నరు. లక్షల మంది విద్యార్థులు చూస్తున్నరు. వాళ్ల గొంతుకనైన నన్ను గెలిపించండి. బీజేపీకి అధికారంలోకి వస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తా. పేదల రాజ్యాన్ని తీసుకొస్తాం. రెండుసార్లు ఓడిపోయాను. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించండి" అని బండి సంజయ్ కోరారు.


Also Read: Kalabhavan Haneef: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత


Also Read: Reservation Bill: కులాల రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. ఆ రాష్ట్రంలో 75 శాతం రిజర్వేషన్లు   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook