హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల పార్థీవదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. నానక్‌రామ్‌గూడలో ఆమె నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ విజయనిర్మల భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. తన సతీమణి విజయనిర్మల ఇక తనతో లేరనే దుఖంలో వున్న కృష్ణను సీఎం కేసీఆర్ ఓదార్చారు. కేసీఆర్ వెంట నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. 


తెలుగు, తమిళ, మళయాళం భాషల్లో నటిగా రాణించడమే కాకుండా దర్శకురాలిగానూ మంచి పేరు తెచ్చుకున్న విజయ నిర్మలను కడసారి చూసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలోఆమె నివాసానికి తరలివస్తున్నారు.