Minister KTR Gets Invitation From USA: గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతమైన వ్యవసాయ ప్రగతి ప్రస్థానాన్ని వివరించాలని కోరుతూ మంత్రి కె. తారక రామారావుకి ఒక అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాత ఆహ్వానం అందింది. వ్యవసాయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శాస్త్రవేత్త, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ ఈ బోర్లాగ్ పేరిట ఏర్పాటు చేసిన బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్ సమావేశంలో మంత్రి కేటీఆర్ ను ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వానం అందించారు. అక్టోబర్ 24 నుంచి 26వ తేదీ వరకు అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలోని డేస్మోయిన్ లో ఈ సమావేశం జరగనున్నది. ఈ సంవత్సరం జరగనున్న బోర్లాగ్ డైలాగ్ సమావేశంలో transformative solutions to achieve a sustainable, equitable, and nourishing food system అనే ప్రధాన ఇతివృత్తం ఆధారంగా చర్చలు కొనసాగనున్నాయి.  ప్రపంచ దేశాలకు చెందిన 1200 మంది అతిథులు ఈ సమావేశానికి నేరుగా హాజరవుతారు. దీంతో పాటు వేలాదిమంది సామాజిక మాధ్యమాల ద్వారా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన విస్తృతస్థాయి చర్చలను ప్రతి ఏటా ఈ సమావేశాల్లో చర్చిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్ర అనుభవాలను ఈ సమావేశంలో చర్చించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ సమావేశాలకు హాజరవుతున్న అనేకమందికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ కు పంపిన ఆహ్వాన పత్రంలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అధ్యక్షులు టెర్రి ఈ బ్రాడ్ స్టాడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యవసాయ ప్రగతి కోసం రాష్ట్రం అనుసరించిన విధానాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించడం ద్వారా ప్రపంచ ఆహార భద్రతను, సరఫరాను పెంచడం, ప్రపంచ ఆహార కొరతను ఎదుర్కోవడం వంటి కీలకమైన అంశాల పట్ల ఒక విస్తృతమైన అవగాహన ఏర్పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని వివరించాలని మంత్రి కేటీఆర్ కు పంపుతున్న ఆహ్వానం ఈ సమావేశానికి గౌరవాన్ని అందిస్తుందని కేటీఆర్ కు పంపిన ఆహ్వాన లేఖలో టెర్రీ తెలిపారు. 


తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ముఖ్యంగా వ్యవసాయ రంగ ప్రగతిని గుర్తించి ఈ అంశం పైన ప్రసంగించాల్సిందిగా వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఫౌండేషన్ పంపిన ఆహ్వానం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలలో రాష్ట్రం వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎన్నో వినూత్నమైన, విప్లవాత్మకమైన కార్యక్రమాలను అనుసరించిందని వాటి ప్రతిఫలాలను ఈరోజు తెలంగాణ రైతాంగం అందుకుంటున్నదని,  ఆహార భద్రత అంశంలో దేశానికి కూడా తెలంగాణ రాష్ట్రం భరోసాగా నిలుస్తుంది అన్నారు. ఇంతటి విజయవంతమైన తెలంగాణ వ్యవసాయ నమూనాను అంతర్జాతీయ వేదిక పైన వివరించాలని వచ్చిన ఆహ్వానం తెలంగాణ రాష్ట్ర విధానాలకు దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు.  మంత్రి కేటీఆర్ తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కి కూడా ఆ సంస్థ నుండి ఆహ్వానాన్ని లభించింది.