సంగారెడ్డి: ఆర్టీసీ సమ్మె చేపట్టిన అనంతరం తరచుగా ఏదో ఓ చోట ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతుండటం, ఆందోళనతో అస్వస్థతకు గురై మృతి చెందుతున్న ఘటనలు తోటి కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న బుధవారం మహబూబాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య ఘటన నుంచి కార్మికులు ఇంకా తేరుకోకముందే ఇవాళ సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో మరో ఆర్టీసీ కార్మికుడు నగేష్ మృతి చెందాడు. నారాయణఖేడ్ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్న నగేష్‌ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. 


నవంబర్‌ 5లోపు ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి ఉద్యోగంలో చేరాలని.. లేదంటే ఉద్యోగాలు పోతాయని సీఎం కేసీఆర్‌ విధించిన డెడ్‌లైన్‌ వార్త విని నగేష్ అస్వస్థతకు గురయ్యాడని... ఆ ఆవేదనతోనే ఆసుపత్రిపాలై మృతిచెందాడని నగేష్ కుటుంబసభ్యులు, బంధువులు తెలిపారు.