సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై టీ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటి అభిమానబలగం కలిగిన మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో ఆయనకే దిక్కులేకపోయింది. ఇక ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణలో ఏముంటుందో అర్థం కావడం లేదు అని పవన్ పై విమర్శనాస్త్రాలు సంధించారామె. గురువారం సాయంత్రం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన సందర్భంగా విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారు. 


గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్, పవన్ కల్యాణ్ ఒకరినొకరు ఏమనుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. ఉన్నట్టుండి ఇప్పుడు ఒకరి అవసరాల కోసం మరొకరు కలిసిపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారామె. అంతటితో ఆగని విజయశాంతి.. పవన్ కల్యాణ్ తెలంగాణలో కాకుండా ఏపీపై దృష్టిపెడితే బాగుంటుందని ఆయనకు ఉచిత సలహా ఇచ్చారు. వీలైతే ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడితే ఇంకా బాగుంటుందని సూచించిన ఆమె.. పవన్‌ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ ఆమోదించరని అన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో.. ఇక్కడ తెలంగాణలో రెండు చోట్ల ఆమోదం పొందడం చంద్రబాబు వల్లే కాలేదనే విషయాన్ని మరో ఉదాహరణ గుర్తించాలని విజయశాంతి చెప్పుకొచ్చారు.