హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల హుజూర్ నగర్ పర్యటన రద్దు చేసుకోవడంపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి విమర్శలు గుప్పించారు. వాతావరణం అనుకూలించలేదన్న సాకుతో సీఎం కేసీఆర్‌ హుజూర్‌నగర్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు కానీ దానివెనుకున్న అసలు కారణం వేరేనని ఆరోపించారామె. కేసీఆర్‌కు నిజంగానే హుజూర్‌నగర్‌కు వెళ్లాలని ఉండుంటే రోడ్డు మార్గం ద్వారానైనా వెళ్లవచ్చు.. కానీ హెలికాప్టర్‌ ద్వారానే వెళ్లాలని ఆయన భావించడానికి కారణం ఆర్టీసీ సమ్మె సెగ తగులుతుందేమోననే భయం వెంటాడటమేనని ఎద్దేవా చేశారు. 


హుజూర్ నగర్ ప్రచార సభకు వెళ్లకుండా సీఎం కేసీఆర్‌ తన ప్రచారాన్ని రద్దు చేసుకున్నప్పుడే టీఆర్‌ఎస్‌ పరోక్షంగా తమ ఓటమిని అంగీకరించినట్లయిందని విజయశాంతి వ్యాఖ్యానించారు.