ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌‌ఏషియా ఇండియా ప్రయాణికులను సరికొత్త ఆఫర్‌ని ప్రకటించింది. విమాన ప్రయాణాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఎయిర్‌ఏషియా ఈ బంపరాఫర్‌ని ప్రకటించింది. రూ.500ల నుండి విమాన టికెట్‌ను ఆఫర్ చేస్తున్నట్లు సోమవారం (సెప్టెంబర్ 17, 2018) ఓ ప్రకటనలో తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా 21మార్గాల్లో తిరిగే విమానాలకు ఈ ప్రత్యేక ఆఫర్‌ వర్తించనుంది. రూ.500-రూ.1500 మధ్య ఈ వన్‌ వే టికెట్లను డిస్కౌంట్‌ రేట్లలో సంస్థ అందిస్తోంది. ఇలాబుక్‌ చేసుకున్న టికెట్లతో సెప్టెంబర్ 17 నుండి నవంబర్ 30, 2019లోపు ప్రయాణించవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 23 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ఎయిర్‌ ఏషియా. కాం, ఎయిర్‌ఏషియా మొబైల్‌ యాప్‌ ద్వారా మాత్రమే విమాన టికెట్లను బుక్‌ చేసుకోవాలంది.


మొదటిసారి విమాన ప్రయాణం చేయాలనుకొనేవారికి ఇదో అద్భుత అవకాశమని కంపెనీ తెలిపింది. కాగా హైదరాబాద్‌, విశాఖపట్నంతో పాటు అమృత్సర్, బాగ్దోగ్ర, బెంగళూరు, భువనేశ్వర్‌, చండీగఢ్‌, చెన్నై, గౌహతి, ఇంఫాల్‌, ఇండోర్‌, జైపూర్‌, కోల్‌కతా, కొచ్చి, నాగ్‌పూర్‌, న్యూఢిల్లీ, పనాజీ, పూణే, రాంచీ , శ్రీనగర్‌, సూరత్‌ నగరాల మధ్య ఈ డిస్కౌంట్‌ ఆఫర్లను అందిస్తోంది ఎయిర్‌ ఏషియా ఎయిర్ లైన్స్.