ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి 'కరోనా వైరస్'. ఇప్పటికే ఈ వైరస్ ను మహమ్మారిగా అభివర్ణించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO మరో బాంబు పేల్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కరోనా వైరస్'తో కలిసి జీవించాల్సిందే..!!
'కరోనా వైరస్' ఎప్పటికీ పోదు..!!
హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ


కరోనా వైరస్ ఎప్పటికీ మానవ జీవితం నుంచి వెళ్లిపోదని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని మీడియా ద్వారా వివరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ మైఖెల్ ర్యాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ తో కలిసి జీవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు హ్యూమన్ ఇమ్యూనో వైరస్ .. HIV ఉన్న విధంగానే మానవ జీవితంలో కరోనా వైరస్ ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. ఐతే HIVని పూర్తిగా నిర్మూలించకపోయినప్పటికీ.. అది సోకిన రోగుల జీవన ప్రమాణం పెరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.  


అలాగే కరోనా వైరస్ ఎప్పటి వరకు అంతమవుతుందనే దానిపై ఇప్పటి వరకు స్పష్టంగా ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఐతే దీనికి పటిష్టమైన వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 100 వ్యాక్సిన్లను పరిశోధకులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. అందులో దాదాపు 10 వరకు క్లినికల్ ట్రయల్స్ కు రెడీగా ఉన్నాయని  చెప్పారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా 2 వేల 500 మంది రోగులు సహకరిస్తున్నారని వెల్లడించారు.



చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరించింది. దాదాపు 4.2 మిలియన్ల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మంది బలయ్యారు. ఇప్పటి వరకు ప్రపంచ మానవాళిపై అత్యధిక స్థాయిలో దాడి చేసిన వైరస్ ఇదే కావడంతో.. ఇది ఎప్పుడు అంతమవుతుందనే దానిపైనా...,  మనం ఎప్పటికి విజయం సాధిస్తామనే దానిపైనా.. స్పష్టత లేదని మైఖెల్ ర్యాన్ తేల్చి చెప్పారు. 
   
అలాగే కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్లు ఇప్పుడు ఎత్తేస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO ఆందోళన వ్యక్తం చేసింది. లాక్ డౌన్ ఎత్తేసినా సరైన నిబంధనలు పాటించకుంటే కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని హెచ్చిరించింది.  సాధారణ పరిస్థితులు రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుందని మైఖెల్ ర్యాన్ అన్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..