ఉగ్రవాద సంస్థ జేయూడీ అధినేత హఫీజ్ సయీద్ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. షరీఫ్ పదవి పోవడానికి, భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన చేసిన స్నేహమేనని ఆయన తెలిపారు. ఇటీవలే హఫీజ్‌ ఇంటి నిర్భంద గడువును పొడిగించాల్సిందిగా పాకిస్తాన్ లాహోర్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. అయితే ఈ పిటీషన్‌ను కోర్టు తిరస్కరించడంతో హఫీజ్ బయటికి వచ్చారు. వచ్చీ రాగానే కాశ్మీర్ ప్రాంతంలో పౌరులను స్వతంత్రులను చేయడమే తన కర్తవ్యమని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షరీఫ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే హఫీజ్ హౌస్ అరెస్టు అయ్యాడు. హఫీజ్ హౌస్ అరెస్టుపై అప్పట్లో భారత ప్రభుత్వం కూడా పాజిటివ్‌గానే స్పందించింది. అయితే కొద్ది రోజుల తర్వాత షరీఫ్ అవినీతి ఆరోపణలతో పదవిని కోల్పోయారు. షరీఫ్ పదవిని కోల్పోవడంపై హఫీజ్ ఇప్పుడు స్పందిస్తూ.. శాంతి ఒప్పందాల పేరుతో మోడీతో స్నేహం చేసిన షరీఫ్‌కి తగిన శాస్తే జరిగిందని తెలిపారు. వేలాదిమంది ముస్లిములను హతమార్చిన మోడీతో స్నేహం చేయడం వల్లే షరీఫ్ పతనమయ్యాడని ఈ సందర్భంగా హఫీజ్ తెలిపాడు


2008లో జరిగిన ముంబయి పేలుళ్ళ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హఫీజ్‌ను పట్టిచ్చే వారికి 10 మిలియన్ల డాలర్లు బహుమతి అందిస్తామని ఎప్పుడో ప్రకటించారు. ఇంటి నిర్భందం నుండి బయటకు వచ్చిన హఫీజ్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఉగ్రవాదులను ప్రోత్సహించడమే పాక్ పనిగా పెట్టుకుందని.. ఐక్యరాజ్యసమితి పేర్కొన్న నిబంధనలను కూడా పాక్ తుంగలో తొక్కుతుందని.. ఇప్పడిప్పుడు పాక్ నిజ స్వరూపం ప్రపంచమంతటికీ తెలుస్తోందని విదేశాంగ కార్యదర్శి రావీష్ కుమార్ తెలిపారు.