హైదరాబాద్: 2020 సంవత్సరానికి స్వాగతం చెప్పడంలో న్యూజిలాండ్ కు చెందిన ఆక్లాండ్, వెల్లింగ్టన్ లు ముందున్నాయి. కొత్త దశాబ్ది వెలుగులు ఇక్కడ ముందే విరజిమ్మాయి. కన్నులు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులతో కొత్త సంవత్సర వేడుకలను ఇక్కడి ప్రజలు జరుపుకున్నారు. 1075 అడుగుల ఎత్తైన స్కై టవర్ పై పేల్చిన బాణాసంచా ఆకాశాన్ని రంగులమయం చేసింది. లండన్ లోని గ్రీన్ విచ్ రేఖాంశం ప్రకారం.. కొత్త సంవత్సరం దక్షిణ పసిఫిక్ సముద్రంలోని దీవులైన సమోవా, క్రిస్టమస్ దీవుల్లోని ప్రజలు తొలుత జరుపుకుంటారు. అనంతరం న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తాయి. సమోవా, క్రిస్టమస్ దీవుల్లో 12 గంటలు కొట్టిన అర్ధగంట తర్వాత న్యూజిలాండ్ లో గడియారం అర్ధరాత్రి పన్నెండు గంటలవుతుంది.


ఆక్లాండ్, వెల్లింగ్టన్ నగరాల్లో ఈసారి ప్రజలు భారీఎత్తున ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. గడియారం 12 గంటలు కొట్టగానే ఒక్కసారిగా ప్రజలు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మరోవైపు ఆకాశంలో రంగురంగుల కాంతులతో తారాజువ్వలు సందడి చేశాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..