పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో.. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి చెందిన మహేష్ కుమార్ మలానీ జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన మొట్టమొదటి హిందూ అభ్యర్థిగా చరిత్ర సృష్టించారు. పీపీపీ పార్టీ తరఫున సింధ్ ప్రావిన్స్‌లోని థార్ పార్కర్-II నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారని.. 14 మందిని వెనక్కు నెట్టి జయకేతనం ఎగురవేశారని స్థానిక పత్రిక ద్వన్ నివేదించింది. గ్రాండ్‌ డెమొక్రటికల్‌ కూటమికి చెందిన అరబ్‌ జాకవుల్లాపై మహేష్ కుమార్ మలానీ 1,06,630 ఓట్లతో గెలుపొందారని, సమీప ప్రత్యర్థి జాకవుల్లాకి 87,251 ఓట్లు వచ్చాయని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేశ్‌ మలానీ పాకిస్థానీ హిందూ రాజస్థానీ పుష్కర్ణ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. 2003-08లో పీపీపీ నుంచి పార్లమెంటు రిజర్వ్‌డ్‌ సీటుకు నామినేట్‌ అయ్యారు. 2013లో, సింధ్ అసెంబ్లీ థార్ పార్కర్-III జనరల్ సీటును గెలిచి ప్రొవిన్షియల్ అసెంబ్లీలో మలానీ మొట్టమొదటి ముస్లిమేతర సభ్యుడయ్యారు. సింధ్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ ఛైర్ పర్సన్‌గానూ సేవలందించారు.



 


ముస్లిం మతస్థులు కానివారు కూడా పాకిస్ధాన్ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2002లో పర్వేజ్ ముష్రాఫ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజ్యాంగ సవరణ చేశారు. వారికి సెనేట్, జాతీయ, ప్రావిన్స్ అసెంబ్లీలలో సీట్లు కేటాయించారు. పది సీట్లను మైనార్టీల కోసం నేషనల్ అసెంబ్లీలో కేటాయించారు.