Sajjala on Narayana Arrest : నారాయణ సంస్థల అధినేత అరెస్టు కక్షసాధింపు చర్య అని ఆరోపిస్తే అది నిజమైపోదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేసి... వాట్సాప్‌ ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా సర్కులేట్ చేసి... తద్వారా ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చిత్తూరు జిల్లాలో మొదలై అక్కడక్కడా చెదురుమదురుగా వ్యాపించిన  విషయం అందరికీ తెలిసిందేన్నారు. మూడేళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం నేతలు వాళ్ల హయాంలో ఎన్నడూ జరగనట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మాస్ కాపీయింగ్‌ను ఒక సంప్రదాయంగా కొనసాగిస్తూ వచ్చిన ఆ పార్టీ నాయకులు, నారాయణ లాంటి వారి అరెస్ట్ కళ్ల ముందు కనిపిస్తున్నా... ఏమీ జరగనట్టు మాట్లాడటం సిగ్గుచేటని సజ్జల అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాళ్ల హయంలో ఏం జరిగిందో జగన్ సర్కారు వచ్చాక కూడా అదే చేద్దామని టీడీపీ నేతలు ప్రయత్నించారని సజ్జల ఆరోపించారు. పిల్లలకు వందకు వంద మార్కులు రావాలనే రేసులో పెట్టి... పిల్లలకు సహజంగా నేర్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత విస్మరించి.. దశాబ్దాలుగా మాస్ కాపీయింగ్‌కు, పేపర్ లీక్‌లకు స్పెషలిస్టులుగా తయారయ్యారని ఆరోపించారు. ఇలాంటి వాటికి సహజంగానే జగన్ సర్కారు వ్యతిరేకమన్నారు. ఎలాగూ సీరియస్ యాక్షన్ తీసుకునే వాళ్లమేనని, అయితే వైఎస్‌ఆర్‌సీపీ నేతలే చేశారని ఆరోపణలు చేసినవాళ్లే ఈ కేసులో నిందితులుగా తేలటం గమనార్హమన్నారు సజ్జల. దాదాపు 50-60 మంది నిందితులుగా తేలటం, అందులో తెలుగుదేశం హయాంలో మంత్రిగా పనిచేసిన నారాయణ లాంటి వాళ్లు ఉండటం విద్యా వ్యవస్థకు మచ్చ తెచ్చే అంశమన్నారు. ఇలాంటి వాళ్ల వల్ల పరీక్షలు పెట్టడం అంటేనే ప్రభుత్వానికి ఓ పెద్ద ప్రహాసనంగా మారిన దుస్థితి నెలకొందన్నారు. ఇలాంటి వారిని ఎవ్వరూ క్షమించరని.. అందుకే ఈ కేసులో పలువురి అరెస్టులు జరిగాయని సజ్జల స్పష్టంచేశారు.


విద్య, వైద్య రంగాల్లో చెడును మొగ్గలోనే తుంచేయకుంటే ప్రభావం భవిష్యత్‌ తరాలపై పడుతుందన్నారు సజ్జల. ప్రశ్నపత్రాల లీకేజ్‌ కేసులో ముఖ్యమంత్రి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని, పోలీసులు స్వేచ్ఛగా పనిచేసి వేగంగా నిందితులను పట్టుకున్నారని అన్నారు. తప్పులను సరిదిద్దకుంటే ప్రజలిచ్చిన అధికారం ఫలాలు అందించలేమన్నారు సజ్జల. చట్టం ఎవరికీ చుట్టం కావొద్దని, అందరూ సమానమే అని గతంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ సందర్భంగానే రుజువైందన్నారు సజ్జల. లీక్‌ కేసును లాజికల్ ఎండ్‌కు తీసుకెళ్లేందుకు సర్కారు పనిచేస్తుందన్నారు. జగన్మోహన్‌రెడ్డి సమీప బంధువు కొండారెడ్డిని కూడా అరెస్ట్ చేపించిన సర్కారు.. జగన్ సర్కారని సజ్జల గుర్తుచేశారు. ఎవరు తప్పు చేసినా ఒకేలా శిక్షలుంటాయని స్పష్టం చేశారు. నారాయణ అరెస్ట్ కక్ష సాధింపు చర్య అని ఆరోపించినంత మాత్రాన నిజంకాదన్నారు సజ్జల.


గతంలో వనజాక్షి అనే ఎమ్మార్వోను చింతమనేని ఎంత అవమానించి హింసించారో అందరికీ తెలుసనీ.. అయినా నిస్సిగ్గుగా ఎమ్మార్వోదే తప్పని తేల్చి, ఆమెకు వార్నింగ్ ఇచ్చిన ఘనత చంద్రబాబు సర్కారుదన్నారు సజ్జల. కానీ జగన్ సర్కారు తన, పర బేధం లేకుండా వ్యవహరిస్తోందన్నారు. గతంలో చంద్రబాబు సర్కారు చేసిన ఆగడాలను భరించలేకనే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. నారాయణ అరెస్ట్ కక్ష సాధింపు చర్య అని ఆరోపించినంత మాత్రాన అది చెల్లనేచెల్లదని సజ్జల స్పష్టం చేశారు. జగన్ సర్కారు ప్రజలంతా ప్రశాంతంగా, సమాజం అవినీతి, లంచాలకు ఆస్కారం లేకుండా ఉండాలనే తలంపుతో పనిచేస్తున్నదని సజ్జల చెప్పుకొచ్చారు.


Also Read - Narayana Arrest: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు వెనక ఉన్న అసలు కారణం ఇదే..?


Also Read - Namitha Pregnant: 41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న హీరోయిన్.. వైరల్‌గా మారిన బేబీ బంప్ ఫోటోస్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook