గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో భాగంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. వివిధ శాఖల్లో ఖాళీలు వెంటనే భర్తీ చేస్తామని, జనవరి 1వ తారీఖు నుండి అన్ని క్యాన్సర్ సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సల అనంతరం రోగులకు విశ్రాంతి కాలం ప్రతీ నెల రూ. 5000 చొప్పున వైస్సార్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా అందించాలని నిర్ణయిచినట్టు తెలిపారు. ఇటీవలి కాలంలో కొందరు తన మతం, కులం గురించి మాట్లాడుతూ దారుణమైన విమర్శలు చేస్తున్నారని, వాటిని వింటుంటే బాధగా ఉంటోందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నానే తప్ప తనకు ప్రతిపక్షాలు ఆపాదిస్తున్నట్టుగా వేరే ఉద్దేశాలు లేవు" అని జగన్ అన్నారు. 


వైస్సార్ ఆరోగ్య ఆసరా పథకం గురించి ప్రస్తావిస్తూ.. నేడు ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వైద్యం చేయించుకునేందుకు ఇకపై ఎవ్వరూ ఇబ్బందులు పడబోరని హామీ ఇస్తున్నానని రాష్ట్ర ప్రజలకు మరోసారి భరోసా ఇచ్చారు. మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తన లక్ష్యమని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.