విజయవాడ: ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్‌కి ఏపీఎస్ఆర్టీసి రూపంలో తొలి సవాల్ ఎదురైనట్టు తెలుస్తోంది. జూన్‌ 13 నుంచి సమ్మె బాట పట్టనున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. జూన్ 12 నుంచే దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు ఆర్టీసీ జేఏసి నేతలు తెలిపారు. ఏళ్ల తరబడిగా పరిష్కారానికి నోచుకోని ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం స్పందించాలని ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ జేఏసి నేతలు డిమాండ్ చేశారు. 


ఆర్టీసీ సిబ్బంది కుదింపుపై ఆర్టీసి యాజమాన్యం నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తమ పార్టీ అధికారంలోకొస్తే, ఆర్టీసీని ప్రేవేటుపరం కానివ్వకుండా ప్రభుత్వంలో కలిపేస్తామని గతంలో జగన్‌ హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటే తమకు మేలు చేసిన వారు అవుతారని జేఏసి నేతలు పేర్కొన్నారు.