MP YS Avinash Reddy: మాజీమంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ మరోసారి నోటీసులు జారీచేసింది. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద అవినాష్ రెడ్డికి నోటీసు జారీ చేసిన సీబీఐ అధికారులు.. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు పిలవడం ఇదేం మొదటిసారి కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే పలుమార్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ.. గత 20 రోజుల నుంచి ఆయన్ని విచారణకు పిలవ లేదు. తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పెండింగ్​లో ఉన్న కారణంగా గత 20 రోజుల నుంచి సీబీఐ విచారణలో కొంత దూకుడు తగ్గించింది. 


ఇదిలావుండగా.. తాజాగా వైయస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసి విచారణకు పిలవడం రాజకీయంగా చర్చనియాంశమైంది. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర, ప్రమేయంపై ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ పై కౌంటర్ లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భారీ కుట్రకు  పాల్పడ్డారని, ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డికి నోటీసు ఇవ్వడంతో నేటి విచారణపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.


అవినాష్ రెడ్డి ప్రశ్నించిన అనంతరం ఆయన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారా లేక ఎప్పటి తరహాలోనే కేవలం ప్రశ్నించి వదిలేస్తారా అనే చర్చ జరుగుతున్నాయి. అన్నింటికి మించి అవినాష్ రెడ్డి అరెస్టుపై  ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా బెట్టింగ్ దందా కొనసాగుతోంది.