అమరావతి: సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ సర్కార్ శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ముందుచూపు లేని బడ్జెట్‌‌గా చంద్రబాబు అభివర్ణించారు. వైఎస్సార్సీపీ మాటలకు, చేతలకు అసలు పొంతనే లేదనేందుకు ఇవాళ వారు ప్రవేశపెట్టిన బడ్జెటే ఓ నిదర్శనమని ఆయన అన్నారు. శ్వేతపత్రంలో ఒకలా ప్రకటించి, బడ్జెట్‌లో మరోలా పేర్కొంటారని ఆరోపించారు. 


ఈ సందర్భంగా బడ్జెట్‌లోని పలు అంశాలను ముఖ్యంగా ప్రస్తావించిన చంద్రబాబు.. 2014లో తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 6 వేలే ఎక్కువని కాగా ఇవాళ రూ.38 వేలు ఎక్కువ కావడం టీడీపీ ప్రభుత్వం ఘనతే అవుతుంది కదా అని అభిప్రాయపడ్డారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో 49 వేల ఉద్యోగాలు రూపకల్పన జరిగిందని మీ గణాంకాలే చెబుతుండగా ఇంకా తమపై విమర్శలు చేయడం ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు.