రాష్ట్ర అసెంబ్లీ భవనం నమూనా తప్ప మిగితా నమూనాలన్నీ ఖరారయ్యాయని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విదేశీ పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి సీఎం అమరావతికి వచ్చారు. సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "అసెంబ్లీ భవన నిర్మాణం డిజైన్ తప్ప మిగితా అన్ని డిజైన్లు ఖరారయ్యాయి. రాజధాని డిజైన్ల  రూపకల్పనలో దర్శకుడు రాజమౌళి విలువైన సూచనలు అందించారు. డిజైన్ల ఖరారులో ఆయన కీలకంగా వ్యవహరించారు. మరో నెలన్నర రోజుల్లో అసెంబ్లీ భవన నిర్మాణ నమూనా కూడా ఖరారు కానుంది. సంక్రాంతికి కాస్త అటు ఇటుగా శాశ్వత భవనాల నిర్మాణ పనులు ప్రారంభిస్తాము. ప్రపంచంలోనే అత్యుత్తమ పరిపాలన నగరం మనదే అవుతుంది." అని చెప్పారు.