చిత్తూరులోని చంద్రగిరి రైల్వేస్టేషన్‌ రాష్ట్రంలో తొలి మహిళా రైల్వేస్టేషన్‌గా అవతరించింది. ఇక్కడి కార్యకలాపాల నిర్వహణ మొత్తం మహిళలకే అప్పగించారు. మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ ఈ స్టేషన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో (మార్చి8)లో భాగంగా కేంద్రప్రభుత్వం చంద్రగిరిని మహిళా రైల్వేస్టేషన్‌గా ప్రకటించిందని వెల్లడించారు.


హైదరాబాద్‌లోని బేగంపేట రైల్వేస్టేషన్‌ను సైతం ఈ విభాగంలో ఎంపిక చేశామన్నారు.  దేశంలో మహిళా రైల్వేస్టేషన్లుగా మొదట ముంబయి, మధ్యప్రదేశ్‌లోని మాతంగి రైల్వేస్టేషన్లను గుర్తించారని చెప్పారు. రాష్ట్రంలో మరో ఆరు రైల్వే డివిజన్లలోనూ ఒక్కో స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. చంద్రగిరి రైల్వేస్టేషన్‌ చిన్న రైల్వే స్టేషన్ కావడంవల్ల తక్కువ మంది మహిళా సిబ్బందితో తీర్చిదిద్దామన్నారు.