శ్రీశైలం జలాయశం వద్ద భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు అధికారుల ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3,06,582 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 3, 28,634 క్యూసెక్కులుగా నమోదు అయింది. రిజర్వాయర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 214.3627 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇంతకు మించి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు.


ఇదిలా ఉంటే వదర నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో 2.80 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు క్రస్ట్ గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కు తరలించారు. ఇక శ్రీశైలం నుంచి వస్తున్న వరదను వచ్చినట్టు సాగర్ నుంచి దిగువకు వదులుతూ ఉండటంతో, ప్రకాశం బ్యారేజ్ వద్ద అన్ని గేట్లనూ అధికారులు ఎత్తివేశారు. దిగువ ప్రాంతాల ప్రజలను మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేటి సాయంత్రానికి శ్రీశైలానికి వచ్చే వరద నాలుగు లక్షల క్యూసెక్కులను దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.