ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సినీనటుడు శివాజీ చెప్పారు. భారత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ మలివిడత బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించకపోతే అమరణ నిరాహార దీక్ష చేస్తానని శివాజీ తెలిపారు.


విజయవాడలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో విలేకరులు సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఏపీకి న్యాయం జరిగేందుకు 'ఆమరణ నిరాహార దీక్ష'కు కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రజల మద్దతును కోరారు. విలేకరుల సమావేశంలో హీరో శివాజీ మాట్లాడుతూ ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గగుణపాఠం చెబుతారన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, హోదా పోరాటాలను మరింత ఉధృతం చేసేందుకు ఈనెల 19న అన్ని పార్టీలతో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని, భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాయలసీమపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు.