Pawan Kalyan On Volunteers: బంగారు ఆభరణాల కోసం ఒంటరి వృద్ధురాలిని వాలంటీర్‌ అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన గురించి తెలుసుకొంటే బాధ ఆగలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆమె ముఖంపై పిడిగుద్దులు గుద్ది.. పీకనులిమి అత్యంత భయానకంగా హత్య చేశాడని అన్నారు. ఆమె నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలోనే ఉన్నా మా అమ్మను కాపాడుకోలేకపోయామని వృద్ధురాలి కొడుకు పడుతున్న ఆవేదన చూసి కడుపు తరుక్కుపోతోందన్నారు. హత్య జరిగి పది రోజులు కావొస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఒక్క నాయకుడు కూడా పరామర్శకు రాలేదంటే వాళ్ల ఆలోచన విధానం ఏంటో అర్థమవుతుందని అన్నారు. పెందుర్తి సుజాతనగర్‌లో ఇటీవల వాలంటీర్‌ చేతిలో హత్యకు గురైన కోటగిరి వరలక్ష్మి కుటుంబాన్ని శనివారం పవన్‌ కళ్యాణ్‌ శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం మీడియాతో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ... "వైసీపీ ప్రభుత్వం తమ నవరత్నాల కోసం నియమించిన వాలంటీర్‌ వ్యవస్థ ఈ రోజు ప్రజల ప్రాణాలు తీస్తోంది. కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారి నేరాలకు తెగబడుతున్నారు. వాళ్లు చేస్తున్న దురాగతాలు కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి. బయటకు రాని నేరాలు చాలానే ఉన్నాయి. పాన్‌ పోర్టు కావాలన్నా, చిన్నపాటి ఉద్యోగానికైనా పోలీస్‌ వెరిఫికేషన్‌ చేస్తారు. వాలంటీర్‌ అనే ఈ సమాంతరం వ్యవస్థలో ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఎందుకు పోలీస్‌ వెరిఫికేషన్‌ చేయడం లేదు..? వైసీపీ తన కోసం వినియోగించుకునే వ్యవస్థను నిబంధనలు గాలికొదిలి తయారు చేస్తోంది.


ఇళ్లలోకి చొరబడి మరీ సమాచారం సేకరిస్తున్న వాలంటీర్లు అసలు ఎలాంటి వారో కూడా చూడకుండానే వారిని నియమించడం ఎంత వరకు సబబు...? వాలంటీర్ల ముసుగులో కొందరు చేస్తున్న దురాగతాలు రోజుకొకటిగా వెలుగు చూస్తున్నాయి. వీరిపై పర్యవేక్షణ లేకపోవడంతో, క్షేత్రస్థాయిలో వారు రెచ్చిపోతున్నారు. ఇదొక దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాకా దాదాపు 30 వేల మంది మహిళలు అదృశ్యమైపోయారని నేను మాట్లాడితే నా మీద వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌ సాక్షిగా నేను చెప్పింది నిజమని తేలింది. ఉత్తరాంధ్ర నుంచి 155 మంది చిన్న పిల్లలు అదృశ్యమైపోయారు. ఇది నేను చెబుతున్నది కాదు.. నోబుల్‌ అవార్డు గ్రహీత కైలాస్‌ సత్యర్థి గారు చెప్పారు.." అని పవన్ కళ్యాణ్ అన్నారు. 


అసలు చిన్నారుల అక్రమ రవాణాకు మూలం ఏమిటో, మాయం అవుతున్న చిన్నారులు ఏమవుతున్నారో కూడా వైసీపీ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. చిన్న బిడ్డలు ఉన్న వారు పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. అసాంఘిక శక్తులు పెట్రేగిపోతున్నాయని.. వ్యవస్థలను సక్రమంగా పని చేయనిస్తే నేరాలే జరగవన్నారు. వ్యవస్థలను బలోపేతం చేసి, శాంతిభద్రతలను కాపాడుకోవడమే జనసేన లక్ష్యమన్నారు.  డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి.. అధికారంలోకి వస్తే ధైర్యం ఎక్కడ నుంచి వస్తుందన్నారు. ఓట్లు వేసే ముందు ప్రజలు ఒక్క సారి ఆలోచించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న లా అండ్‌ అర్జర్‌ పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 


Also Read: Bhola Shankar Collections: భోళా శంకర్ మూవీకి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. అస్సలు ఊహించలేరు..!  


Also Read: BJP Woman Leader Suicide: బీజేపీ నాయకుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు లీక్.. మహిళా నేత ఆత్మహత్య  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి