హైదరాబాద్: కోడెల శివప్రసాద రావు పార్థివదేహానికి పోస్టుమార్టం ముగిసిన తర్వాత ఆయన పార్థివదేహాన్ని టీడీపి అధినేత చంద్రబాబు సూచనల మేరకు ఉస్మానియా ఆసుపత్రి నుంచి నేరుగా ఎల్వి ప్రసాద్ చౌరస్తాలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కి తరలించారు. టీడిపి నేతలు, కార్యకర్తలు, కోడెల శివప్రసాద్ రావు అభిమానులకు సందర్శనార్థం ఈ రాత్రికి ఆయన పార్థివదేహాన్ని అక్కడే ఉంచి రేపు మంగళవారం ఉదయం గంటూరుకు తరలించనున్నారు. 


ఈ నెల 14నే కెన్యాకు వెళ్లిన కోడెల శివప్రసాద రావు కుమారుడు శివరాం తన తండ్రి మరణవార్త తెలుసుకుని గుంటూరుకు తిరుగుప్రయాణమయ్యారు. రేపటిలోగా ఆయన గుంటూరుకు చేరుకుంటారని మాజీ మంత్రి, టీడీపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శివరాం ఇంటికి చేరుకున్న అనంతరం మంగళవారం లేదా బుధవారం గుంటూరు జిల్లాలోని నరసారావుపేటలో కోడెల శివప్రసాద్ రావు పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగుతున్నట్టే తెలుస్తోంది.