ఆంధ్రప్రదేశ్ పర్యటనలో వున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబం ఓ అనుకోని ఉపద్రవం నుంచి బయటపడింది. బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏపీ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో పలు అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో నిమగ్నమై వున్న సమయంలో ఆయన సతీమణి సవితా కోవింద్‌, కూతురు స్వాతితో కలిసి బెజవాడ కనకదుర్గమ్మను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం రాజగోపురం లోపలకు వెళ్లే క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన ఐరన్ ర్యాంపు వద్ద సవిత అదుపు తప్పి కిందికి జారిపోయారు. ఆ సమయంలో పక్కనే వున్న సెక్యురిటీ సిబ్బంది వెంటనే ఆమెను కిందపడకుండా పట్టుకుని ఆమెని సురక్షితంగా గమ్యస్థానానికి తీసుకెళ్లారు. 


సెక్యురిటీ సిబ్బంది అప్రమత్తంగా వుండటంతో ప్రమాదం తప్పింది కానీ లేదంటే రాష్ట్రపతి పర్యటనలో అపశృతి చోటుచేసుకుందనే అప్రతిష్ట మూటకట్టుకోవాల్సి వచ్చేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమ్మవారి దర్శనం అనంతరం రాష్ట్రపతి కుటుంబసభ్యులు కృష్ణా నది దాటుకుని వెళ్లి భవానీ ద్వీపాన్ని సందర్శించారు.