Odisha Train Accident: ఒడిశా ఘటనపై ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష, ఘటనా స్థలానికి ఏపీ, తమిళనాడు నుంచి ప్రత్యేక బృందాలు
Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా..రాష్ట్రం నుంచి ఉన్నత స్థాయి కమిటీని పంపిస్తున్నారు. మరోవైపు తమినాడు నుంచి కూడా మంత్రుల బృందం వెళ్తోంది.
Odisha Train Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాల వ్యక్తులు ఉండే అవకాశాలున్నాయి. ఈ ఘోరకలిలో ఇప్పటి వరకూ 278 మంది మరణించగా, 1000 మంది వరకూ గాయపడ్డారు. ఈ ఘోర రైలు ప్రమాదంపై అప్రమత్తమైన ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు ప్రత్యేక బృందాల్ని ఘటనా స్థలానికి పంపించాయి.
ఒడిశాలోని బహానగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో కోరమాండల్, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లు, గూడ్ రైలు ఢీ కొన్న ఘటనలో 278 మంది మృత్యువాత పడగా, 1000 మంది వరకూ గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో తెలుగువారు 120 మంది కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ఉన్నట్టు సమాచారం. ఇక యశ్వంత్ పూర్లో ఎంతమంది ఉన్నారనేది తెలియలేదు. మరోవైపు తమిళనాడుకు చెందిన వారి గురించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ప్రమాద ఘటనపై వివరాలు, సహాయక చర్చల కోసం తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, శివశంకర్, అనిల్ మహేశ్ ఘటనా స్థలానికి బయలుదేరారు.
ఈ ఘటనపై అప్రమత్తమైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ల బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేయడమే కాకుండా అవసరమైతే పంపించేందుకు ఆంబులెన్స్లు సిద్ధం చేశారు. ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఆసుపత్రులను అలర్ట్ చేశారు. తెలుగువారి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుని తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
ఏపీ ప్రభుత్వం బృందంలో మంత్రి గుడివాడ అమర్ నాథ్తో పాటు పౌర సరఫరాల శాఖ కమీషనర్ అరుణ్ కుమార్, విశాఖ కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమీషనర్ ఆనంద్, శ్రాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్లు ఉన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేశారు. రైల్వే అధికారుల్నించి అందిన ప్రయాణీకుల సమాచారం మేరకు వారి పరిస్థితి తెలుసుకునేందుకు, బంధువులు ఇతర కుటుంబ సభ్యులు సమాచారం రాబట్టేందుకు ఎప్పటికప్పుడు పనిచేయాలని ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు విశాఖపట్నం సహా ఒడిశా సరిహద్దు జిల్లాల్లోని ఆసుపత్రులను సిద్ధం చేయాని వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ ఘటనపై తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు అందించాలని కోరారు. ప్రమాద ఘటనలో రైల్వే డీఆర్ఎం నుంచి సమాచారం రప్పిస్తున్నామన్నారు.
కోరమాండల్ రైలులో ఏపీ వ్యక్తులు
విజయవాడ రీజయన్ పరిధిలో 48 మంది రిజర్వేషన్
కోరమాండల్ విజయవాడ నుంచి 35 రిజర్వేషన్
ఏలూరుకు రిజర్వేషన్ చేసుకున్న ఇద్దరు
తాడేపల్లిగూడెంకు రిజర్వేషన్ చేసుకున్న ఒకరు
రాజమండ్రిలో దిగేందుకు 12 మంది రిజర్వేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook