తనకు స్వాగతం పలికేందుకు హోర్డింగులు ఏర్పాటు చేసే క్రమంలో విద్యుత్ షాక్‌కి గురై మృతి చెందిన ఇద్దరు అభిమానుల కుటుంబాలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్ర సంతాపం ప్రకటించారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో పర్యటించేందుకు వస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్‌కి స్వాగతం పలికేందుకు 30 అడుగుల పొడవైన భారీ హోర్డింగులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేసిన పవన్ కల్యాణ్ అభిమానులు టి నాగరాజు, బి శివ బుధవారం విద్యుత్ షాక్‌తో దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్... బాధితుల కుటుంబాలను స్వయంగా కలిసి పరామర్శించనున్నట్టు తెలిపారు. 


జనసేన పార్టీ చేపట్టిన పోరాట యాత్రలో భాగంగా ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ ఈ ఘటనపై మాట్లాడుతూ తన అభిమానుల మృతి తనని తీవ్రంగా కలిచివేసింది అని ఆవేదన వ్యక్తంచేశారు. బాధితుల కుటుంబాలను స్వయంగా కలుసుకుని, ఆ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తానని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు.