జనసేన పార్టీ త్వరలో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించనుంది. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని  పార్టీ పరిపాలన కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశం జరిగింది. ముఖ్యంగా వచ్చే ఆరు నెలల్లో పార్టీ పరంగా నిర్వహించనున్న ముఖ్యమైన కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. పార్టీ ప్లినరీ సమావేశం, సభ్యత్వ నమోదు రెండు రాష్ట్రాల్లో పవన్ పర్యటనతో పాటు ఇతర ముఖ్య విషయాలపై నిర్ణయాలను ఖరారు చేశారు. పార్టీ ప్లీనరీ ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై సమావేశంలో కొన్ని ప్రతిపాదనలను పరిశీలించారు.  దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సమావేశం వివరాలను ఆ పార్టీ మీడియా విభాగం హెడ్ పి.హరి ప్రసాద్  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.