విజయవాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిలా కాకుండా ఒక వైఎస్సార్సీపీ నేతలా చిల్లరగా మాట్లాడుతున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా సమస్యను తప్పుదోవ పట్టించడానికి వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటే.. వారి పాలనలో లోపాలు ఉన్నాయనే అర్ధమవుతుందని,  వైసీపీ నాయకులు భాషా సంస్కారాలు మరిచి ఎంత హీనంగా మాట్లాడినా తాము మాత్రం ప్రభుత్వ విధివిధానాలను ప్రశ్నిస్తూనే ఉంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.