ఢిల్లీ: గురువారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంట్‌లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. అఖిలపక్ష సమావేశంలోకి కేవలం పార్టీ అధినేతలు, అధ్యక్షులు, లేదా పార్టీ ఆదేశానుసారం వెళ్లిన ప్రజాప్రతినిధులకే అనుమతి ఉండటంతో వైఎస్సార్సీపీ ఎంపీలు హాలు బయటే ఉండి సమావేశంలో పాల్గొన్న తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం వేచిచూస్తున్నారు. 


ఇదిలావుంటే, ఇంతలో అన్నిపార్టీల నేతలతో అఖిలపక్ష భేటీ ముగించుకుని మీటింగ్ హాలు నుంచి బయటికొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అటుగా వెళ్తూ అక్కడే వున్న వైఎస్సార్సీపీ ఎంపీల్లో విజయ సాయి రెడ్డిని గమనించారు. ఆయనను చూసిందే తడవుగా హాయ్ విజయ్ గారూ అని ప్రత్యేకంగా పలకరిస్తూ కరచాలనం కోసం చేయి అందించారు. ప్రధాని మోదీ పలకరింపునకు విజయ్ సాయి రెడ్డి స్పందిస్తూ వెంటనే ప్రధానికి అభివాదం చేస్తూ వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం వెంటనే ప్రధాని మోదీ తన దారిలో ముందుకుసాగిపోయారు.