అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ నెల 18న కర్నూలుకి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రఘవీరారెడ్డి మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 18న కర్నూలుకు రానున్నారు. కర్నూలు జిల్లాలో పార్టీ తలపెట్టిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ దామోదరం సంజీవయ్య ఇంటిని కూడా సందర్శిస్తారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తర్వాత కర్నూలు ఎస్టీబీసీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు' అని రఘువీరా తెలిపారు.


ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన హామీల అమలుపై రాహుల్‌గాంధీ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ.. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమని అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే దిశగా రాహుల్‌ గాంధీ పర్యటన ఉంటుందని.. బహిరంగ సభలో రాహుల్ గాంధీ అనేక అంశాలపై మాట్లాడుతారని రఘువీరా వ్యాఖ్యానించారు.