హైదరాబాద్: లక్షదీవుల నుంచి తెలంగాణ వరకు కేరళ, దక్షిణ కర్ణాటక, రాయలసీమ మీదుగా 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఏపీలో రానున్న 3 రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. తెలంగాణలో శుక్రవారం, శనివారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన స్పష్టంచేశారు.


ఇదిలావుంటే, మరోవైపు కోస్తాంధ్రాలోనూ రానున్న 24 గంటల్లో మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల ఆకాశం మేఘావృత్తమై కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.