హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా తెలంగాణ నుంచి రాయలసీమ వరకు అదే ఎత్తులో సమాంతరంగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ఉపరిదల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. 


గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న 36 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనికితోడు ఉత్తర భారత దేశం నుంచి బలంగా వీస్తున్న చలిగాలుల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశాలూ వున్నాయని అధికారులు పేర్కొన్నారు.