శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో మైత్రిపాల సిరిసేనతో పాటు ఆయన  భార్య జయంతి పుష్పకుమారి మరియు శ్రీలంక అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం సిరిసేన దంపతులకు పట్టువస్త్రాలు, ప్రసాదం, ఫోటో ప్రేమ్ ను తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అందజేశారు. రంగనాయకుల మండపంలోని పండితులు వేద ఆశీర్వచనం చేశారని  ఆలయ అధికారులు తెలిపారు. దర్శనం అనంతరం శ్రీలంక అధ్యక్షుడు రోడ్డుమార్గం గుండా బెంగళూరు చేరుకొని కొలంబోకు తిరుగుప్రయాణం అయ్యారు. అధ్యక్ష హోదాలో మైత్రిపాల సిరిసేన తిరుమలను దర్శించడం ఇది మూడోసారి.  గతంలో ఆయన 2015  ఫిబ్రవరి,  2016 ఆగస్టు లో తిరుమలను సందర్శించారు.