కర్నూలు: రాయలసీమలో రాజధాని, హైకోర్టును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో అక్కడి విద్యార్థి సంఘాలు నిర్వహించిన ధర్నా కాస్తా ఉద్రిక్తంగా మారింది. కర్నూలు జిల్లా నంద్యాలలో మంత్రుల సమీక్షా సమావేశం భవనం ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. రాయలసీమలో రాజధాని, హై కోర్టు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. దీంతో విద్యార్థుల ఆందోళనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదం కాస్తా తోపులాటకు దారితీసింది. దీంతో నంద్యాలలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


ఇదిలావుంటే, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు అంశం పరిశీలనలో ఉందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. శుక్రవారం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ చాలా అవసరమని, 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టంచేశారు.