న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ప్రతినిధి బృందం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ ప్రతినిధి బృందం రాష్ట్రపతికి విన్నవించింది. సీఎం రమేష్ నేతృత్వంలో ఎంపీలు, కడప జిల్లా ప్రజాప్రతినిధులు రాష్ట్రపతిని కలిశారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో కేంద్రం చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని కోరారు. ఉక్కు కర్మాగారం ఆంధ్రుల మనోభావాలకు చెందిన అంశం కాబట్టి ఆ హామీ నెరవేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్యాహ్నం ఉక్కు శాఖ మంత్రి  బీరేంద్ర సింగ్ తో టీడీపీ ప్రతినిధి బృందం భేటీ కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్లమెంటు ప్రాంగణంలో తెదేపా ఎంపీల నిరసన


అటు ఏపీకి న్యాయం చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్‌  చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రజాకవి వేషధారణలో ఎంపీ శివప్రసాద్ నిరసన తెలియజేశారు. మాటల గారడీ చేస్తూ ప్రజలను మోదీ మోసగిస్తున్నారని శివప్రసాద్ మండిపడ్డారు.