Headmaster Sleeping Naked In Front Of Students : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఒక సర్కారు బడి హెడ్ మాస్టర్ చిత్తుగా స్కూల్ కి తాగి వచ్చి మద్యం మత్తులో విద్యార్థిని, విద్యార్థుల ముందే నగ్నంగా పడుకున్న వైనం ఇది. హెడ్ మాస్టర్ స్కూల్లో విద్యార్థుల ఎదుట నగ్నంగా పడుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో విషేశ్వర్‌గంజ్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడం చూసిన ఉన్నతాధికారులు.. సదరు ప్రధానోపాధ్యాయుడు దుర్గా ప్రసాద్ జైశ్వాల్ ని సస్పెండ్ చేశారు. మద్యం మత్తులో విద్యార్థుల ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించాడు అనే ఆరోపణలపై స్కూల్ హెడ్ మాస్టర్‌ని సస్పెండ్ చేసినట్లు బుధవారం ఒక ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్కూల్ హెడ్ మాస్టర్ దుర్గా ప్రసాద్ జైస్వాల్ మద్యం మత్తులో పాఠశాలకు వెళ్లడమే కాకుండా అక్కడ విద్యార్థుల ఎదుట నగ్నంగా నిద్రిస్తుండటం ఈ వీడియోలో చూడవచ్చు. దుర్గా ప్రసాద్ జైస్వాల్ ఇలా క్లాస్ రూమ్ లో బట్టలు విప్పడం కొత్తేం కాదని.. తరచుగా క్లాస్‌లో బట్టలు విప్పుకుని తిరిగేవాడు అని పిల్లల తల్లిదండ్రులు సైతం మీడియా ఎదుట వాపోయారు.  దుర్గా ప్రసాద్ జైశ్వాల్ చేష్టలతో ఇబ్బంది పడిన విద్యార్థినులు పాఠశాలలకు వెళ్లడమే మానేశారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించారు. 


విషేశ్వర్‌గంజ్‌లోని శివపూర్ బైరాగి ప్రాథమిక పాఠశాలలో దుర్గా ప్రసాద్ జైస్వాల్ మద్యం మత్తులో నగ్నంగా నిద్రించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అసలు ఈ వీడియోలో ఎంతమేరకు వాస్తవికత ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది అని ఉన్నతాధికారులు తెలిపారు. 


ఈ ఘటనపై బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అవ్యక్త్ రామ్ తివారీ మాట్లాడుతూ, " ప్రాథమిక పాఠశాక ప్రధానోపాధ్యాయుడు దుర్గా ప్రసాద్ జైస్వాల్‌ మద్యం మత్తులో పాఠశాలకు వచ్చినట్టుగా అతడిపై తమకు ఫిర్యాదు వచ్చిందని.. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ప్రాథమిక విచారణలో భాగంగా జూలై 24న అతన్ని సస్పెండ్ చేశారు " అని తెలిపారు. ప్రస్తుతానికి శాఖాపరమైన విచారణ జరుగుతోందన్న అవ్యక్త్ రామ్ తివారీ.. అవసరమైతే, ప్రధానోపాధ్యాయుడు దుర్గా ప్రసాద్ జైశ్వాల్‌పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.