రజనీకాంత్ నటించిన "రోబో 2.0" చిత్రం ట్రైలర్ ఈ రోజే విడుదలైంది. ఈ ట్రైలర్‌లో రోబో చిట్టి బ్యాంగ్‌ను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ పనితీరుగానీ, గ్రాఫిక్స్ గానీ ప్రేక్షకులను మైమరిపించేలా ఉన్నాయని ఇప్పటికే నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అన్ని రికార్డులను తుడిచిపెట్టడానికే ఈ సినిమా వస్తుందని ఇప్పటికే రజనీ అభిమానులు కొందరు జోస్యం కూడా చెబుతున్నారు. ఈ రోజు జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకకు దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌తో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ మరో వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని సత్యం సినిమాస్‌లో ఈ ట్రైలర్ లాంచ్ వేడుక అట్టహాసంగా జరిగింది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరై... రోబో టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రూ.450 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ బ్యానరుపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 


ఈ సినిమా నవంబరు 29వ తేదిన థియేటర్లలో విడుదల కాబోతోంది. 4డీ సౌండ్ టెక్నాలజీతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. భారతదేశంలో తొలిసారిగా ఈ టెక్నాలజీతో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించగా.. ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. హిందీలో ధర్మా ప్రొడక్షన్స్ ఈ చిత్ర డబ్బింగ్ హక్కులు సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 13 భాషలలో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.