స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా 'అల వైకుంఠపురములో'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలు, ట్రెయిలర్ అభిమానులను అలరిస్తున్నాయి. తాజాగా.. 'అల వైకుంఠపురములో' చిత్రం నుంచి మరో పాటకు సంబంధించిన టీజర్ ను గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేసింది.  'బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ.. నన్ను సుట్టుకుంటివే..' అంటూ సాగే ఈ పాట .. ఇప్పుడు అభిమానుల్లో ఉత్సుకత పెంచుతోంది. ఈ పాట కూడా గతంలో విడుదలైన పాటల్లాగే చాలా బాగున్నట్లు తెలుస్తోంది. 'అల వైకుంఠపురములో' చిత్రం నుంచి ఇప్పటి వరకు మూడు పాటలు విడుదలయ్యాయి. అందులో 'సామజవరగమన', 'రాములో రాముల' పాటలు 100 మిలియన్  వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ' ఓ మైగాడ్ డాడీ' సాంగ్ కూడా అల్లు అర్జున్  అభిమానులను అలరిస్తోంది. తాజాగా విడుదలైన 'బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మ..' పాటను అర్మాన్ మాలిక్ పాడారు. ఈ పాటను పూర్తిగా డిసెంబర్ 24న విడుదల చేయనున్నారు.



జనవరి 12న సినిమా విడుదల 
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. టబు, సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.