మళయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమాతో సినీ పరిశ్రమకు, ఆ తర్వాత అఆ సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్‌కి పరిచయమైన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. అఆ తర్వాత తెలుగులో ప్రేమమ్ రీమేక్, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌కి మరింత చేరువయ్యింది. అనుపమ ఈ ఏడాది తెలుగులో మరో మూడు సినిమాలు చేస్తోంది. అందులో మొదటిది తేజ్ ఐ లవ్ యూ కాగా రెండోది హలో గురు ప్రేమకోసమే, మూడోది ఎవడో ఒకడు. తేజ్ ఐ లవ్ యూ సినిమా విడుదల తేదీ సమీపిస్తోన్న తరుణంలో నిన్న శనివారం విజయవాడలో జరిగిన ‘తేజ్‌ ఐ లవ్‌ యూ’ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్న అనుపమ అక్కడ తన మనసులో మాటను బయటపెట్టారు. 


మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన చేస్తోన్న తేజ్ ఐ లవ్ యూ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో అనుపమ మాట్లాడుతూ.. ''మెగాస్టార్ చిరంజీవికి తాను వీరాభిమానిని' అని అన్నారామె. చిరు ఓ గొప్ప నటుడు. అందుకే ఛాన్స్‌ వస్తే చిరంజీవి గారితో ఒక అర నిమిషం నటించినా చాలు. నా జన్మ ధన్యమైనట్లే'' అని తన కోరికను వెల్లడించారు. లవ్ స్టోరీల ఎక్స్‌పర్ట్స్ కరుణాకరన్ తెరకెక్కించిన తేజ్ ఐ లవ్ యూ మూవీ అతడి గత చిత్రాల మాదిరిగానే మంచి లవ్ స్టోరీ అని అన్నారామె. ప్రముఖ నిర్మాత కేఎస్ రామా రావు నిర్మించిన ఈ సినిమా జులై 6న విడుదల కానుంది.