యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న అరవింద సమేత సినిమాకు మళ్లీ లీకుల బెడద తప్పలేదు. గతంలోనే పలు స్టిల్స్ లీకై బయటికి రావడంతో షూటింగ్ జరుగుతున్న చోట మొబైల్ ఫోన్స్‌ని నిషేధించింది ఆ చిత్రయూనిట్. అయినప్పటికీ ఆ సినిమాలోంచి పలు కీలకమైన సన్నివేశాలకు సంబంధించిన స్టిల్స్ కొన్ని మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత ఎస్ రాధాకృష్ణలకు తలనొప్పిగా మారింది. రాయల సీమ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం లీకైన సన్నివేశాల స్టిల్స్ ఎంతో కీలకమైనవని యూనిట్ భావిస్తోంది. షూటింగ్ సెట్స్ లో మొబైల్స్ నిషేధించిన తర్వాత ఈ స్టిల్స్ లీక్ కావడంతో కచ్చితంగా ఇవి ప్రొడక్షన్ ఎడిటింగ్ రూమ్ నుండి బయటకు వచ్చినవే అయ్యుంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో స్టిల్స్ లీక్ చేసిన ఆ అదృశ్యం హస్తం ఎవరిదై ఉంటుందా అని తెలుసుకునే పనిలో పడిన యూనిట్ గుట్టుగా అంతర్గత విచారణ జరుపుతోంది. 


జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ల కాంబోలో వస్తున్న సినిమా కావడం అందుకు ఓ ప్రధానమైన కారణం. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే జంటగా నటిస్తోంది. నాగబాబు, జగపతిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆగస్ట్ 15న అరవింద సమేత టీజర్ సైతం రిలీజ్ కాబోతోంది. ఈ టీజర్ కోసం వేచిచూస్తున్న అభిమానులకు అంతకన్నా ముందే లీకైన ఈ స్టిల్స్ ఒకింత జోష్‌నిచ్చాయి.