లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో వున్న కారణంగా అనుకున్న సమయానికి విడుదలకు నోచుకోని పీఎం నరేంద్ర మోదీ బయోపిక్ సినిమా విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. మే 19న చివరి విడత ఎన్నికలు ముగియనుండగా మే 23న ఫలితాలు వెల్లడి కానుండటంతో ఆ తర్వాత ఎప్పుడైనా ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చని గతంలోనే కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. అలా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆగిపోయిన ఈ సినిమాను మే 24వ తేదీన విడుదల చేసేందుకు యూనిట్ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాతల్లో ఒకరైన సందీప్ సింగ్ ట్విటర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వివేక్ ఒబేరాయ్ ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో నటించగా సందీప్ సింగ్, ఆనంద్ పండిట్, సురేష్ ఒబెరాయ్ సంయుక్తంగా నిర్మించారు. బొమన్ ఇరాని, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, బర్కా బిష్ట్, రాజేంద్ర గుప్తా, జరినా వహబ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.